బస్సును వెంబడించి ఆపిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్.. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవద్దంటూ డ్రైవర్‌కు వార్నింగ్!

  • బస్టాప్‌లో ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
  • వెంబడించి అడ్డగించిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్
  • ఉచిత బస్సు పథకం తెచ్చాక సిబ్బంది తీరు మారలేదని ఆగ్రహం
  • బస్సులోనే ప్రయాణించి మహిళలతో మాట్లాడిన ఎమ్మెల్యే
కృష్ణా జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే సహించేది లేదని ఆయన గట్టిగా హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా కంకిపాడు సినిమా హాల్ సెంటర్‌లోని బస్టాప్‌లో పలువురు ప్రయాణికులు బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు, ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. అదే సమయంలో తన కారులో బస్సు వెనకే వస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఈ విషయాన్ని గమనించారు. వెంటనే ఆయన తన కారుతో బస్సును ఓవర్‌టేక్ చేసి అడ్డంగా ఆపారు. అనంతరం బస్సులోకి ఎక్కి డ్రైవర్, కండక్టర్‌ను నిలదీశారు.

బస్టాప్‌లో ప్రయాణికులు ఎదురుచూస్తుంటే బస్సు ఎందుకు ఆపలేదని డ్రైవర్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోందని, కానీ కొందరు ఆర్టీసీ సిబ్బంది తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. "బస్సు ఖాళీగానే ఉంది కదా, ఎందుకు ఆపలేదు? ఒకవేళ సీట్లు లేకపోతే ప్రయాణికులు నిల్చుని వస్తారు. మీరు బస్సులు ఆపకపోతే ప్రజలు ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. ఈ ఒక్కచోటే కాదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రైవర్, కండక్టర్ పొంతనలేని సమాధానాలు చెప్పి కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. తాను స్వయంగా చూశానని, బస్సు ఆపలేదనేది వాస్తవమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సిబ్బంది తీరు ఇలాగే ఉంటే ఫ్రీ బస్సు పథకం పెట్టినా ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని గట్టిగా హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గోసాల సెంటర్ వరకు అదే బస్సులో ప్రయాణించి, ప్రయాణికులతో మాట్లాడారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఉచిత బస్సు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Bode Prasad
MLA Bode Prasad
Penamaluru MLA
APSRTC
Free Bus Scheme
Andhra Pradesh
Krishna District
Bus Driver
Public Transport
Free Bus Travel for Women

More Telugu News